Travis Head | కరోనా బారినపడ్డ ట్రావిస్‌ హెడ్‌..

19th May, 2025 01:09 PM

Travis Head | సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కరోనా వైరస్ బారినపడ్డాడు. సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ఈ విషయాన్ని వెల్లడించాడు. హెడ్‌ కొవిడ్‌ బారినపడడంతో భారత్‌కు రావడంలో ఆలస్యమవుతుందని కోచ్‌ పేర్కొన్నాడు. అయితే, హెడ్‌కు ఎప్పుడు.. ఎక్కడ కరోనా వైరస్‌ వచ్చిందనే విషయాన్ని మాత్రం సన్‌రైజర్స్‌ కోచ్‌ సమాధానం ఇవ్వలేదు. సోమవారం ఉదయం వరకు భారత్‌కు చేరుకుంటాడని.. వైద్య సిబ్బంది అతన్ని పరీక్షిస్తారని ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తామని పేర్కొన్నాడు.వెట్టోరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హెడ్‌ సోమవారం ఉదయం వస్తున్నాడని చెప్పాడు. కొవిడ్‌ బారినపడడంతో ప్రయాణించలేకపోయాడని తెలిపాడు. ఇదిలా ఉండగా.. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ వారం పాటు వాయిదా పడింది. హెడ్‌ కెప్టెన్‌ కమిన్స్‌తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. జూన్‌ 11న ప్రారంభం కానున్న ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఇద్దరు మళ్లీ ఐపీఎల్‌లో చేరుతారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే, మిగతా మ్యాచుల కోసం హెడ్‌, కమిన్స్‌ ఇద్దరూ భారత్‌కు వస్తారని సన్‌రైజర్స్‌ జట్టు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉండగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది. మే 25న చివరి గ్రూప్‌ మ్యాచ్‌ ఆడనున్నది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సోమవారం లక్నోతో, ఆ తర్వాత ఆర్‌సీబీ, కేకేఆర్‌తో మ్యాచులు ఆడనున్నది. ఇదిలా ఉండగా.. ట్రావిస్‌ హెడ్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 11 మ్యాచుల్లో 281 పరుగులు చేశాడు. గత సీజన్‌లో 15 మ్యాచుల్లో 567 పరుగులు చేయగా.. ఈ సారి మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.