జర్నలిజమా? శాడిజమా?

28th May, 2025 05:29 PM

ఆంధ్రజ్యోతికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రిక బుధవారం ఒక కథనాన్ని వండి వార్చింది. పొరుగు రాష్ట్రంలో కడప గడ్డపై తమ ఇంటి పండుగలాంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోన్న వేళ ఆ వార్తలకు ఫస్ట్‌ పేజీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్సీ కవితపై కట్టుకథను పతాక శీర్షికన ప్రచురించింది. బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ పార్టీ మార్పుపై కథనం రాస్తున్నప్పుడు కనీసం ఆమె వివరణ తీసుకోవాలన్న సోయి మరిచింది ఆంధ్రజ్యోతి. జర్నలిజం విలువల వలువలను ఎప్పుడో వదిలేసి ఒక రాజకీయ పార్టీతో ప్రత్యక్షంగానే అంటకాగుతోన్న మీడియా హౌస్‌ ఎమ్మెల్సీ కవితను టార్గెట్‌ చేస్తూ కథనాలు వండి వార్చడం వెనుక పెద్ద లక్ష్యమే ఉన్నది. తెలంగాణలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమికి గ్రౌండ్‌ క్లియర్‌ చెయ్యడమే ఇప్పుడు సీమాంధ్ర మీడియా హౌస్‌ ల పని. తద్వారా తెలంగాణపై గుత్తాధిపత్యం చెలాయించొచ్చు అనేది ఆ సెక్షన్‌ నాయకత్వం, మీడియా బాసుల అంతరంగం. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితను టార్గెట్‌ చేస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. తమ లైవ్‌ చానెళ్లలో స్పెషల్‌ డిస్కషన్స్‌, స్టోరీల రూపంలో ప్రచారం చేస్తున్నారు.


బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర లోపే బీఆర్‌ఎస్‌ నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం ఇక్కడ రాజకీయ గుత్తాధిపత్యం చెలాయిస్తోన్న, చెలాయించాలని చూస్తోన్న సెక్షన్స్‌ కు మింగుడు పడలేదు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం అనే నినాదం పని అయిపోయింది.. ఇక లేచి నిలబడలేదు అనుకున్న వారి అంచనాలు ముక్కలు చెక్కలు అయ్యాయి. దీంతో తాము ఊహాలోకంలో నిర్మించుకున్న మాయాసౌధం శిథిలమయ్యిందనే అక్కసు ఆ సెక్షన్‌ మీడియాతో పాటు వాటిని పెంచిపోషిస్తున్న సీమాంధ్ర రాజకీయ శక్తులకు మిగిలింది. ఈక్రమంలోనే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ ప్రసంగంపై ఫీడ్‌ బ్యాక్‌ పేరుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖను అడ్డం పెట్టుకొని కృత్రిమ ప్రచారాలు కొనసాగించాయి. తన లేఖను లీక్‌ చేసిన దెయ్యాలెవరో బయట పెట్టాలని కవిత స్పష్టమైన డిమాండ్‌ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. ఈక్రమంలోనే పార్టీలో ముఖ్య నాయకుల ప్రాపకం కోసం కొంత మంది ఈ విషయాన్ని చిలువలు పలువలు చేసే ప్రయత్నం చేశారు. కాలమే అన్నింటికీ సమధానం చెప్తుందన్న ధోరణిలో ఎమ్మెల్సీ కవిత వాటిని చూసీ చూడనట్టు వదిలేశారు.


తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్‌ వెంట నడిచిన నాయకత్వానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కవిత కొంత కాలంగా చెప్తున్నారు. కొన్ని నెలలుగా ప్రజల్లోనే ఉంటున్న ఆమె 47 నియోజకవర్గాల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలను ప్రత్యక్షంగా కలిశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమ నాయకత్వం నిరదారణకు గురైందనే వాస్తవాన్ని గుర్తించి వాళ్లందరికీ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఇది సహజంగానే పార్టీలో కొంత మంది నాయకులకు నచ్చకపోవచ్చు. ఈక్రమంలోనే కవితపై రకరకాల కథనాలు ప్రచారంలోకి తెచ్చారనే వాదన ఉంది. దీనినే తమకు అనుకూలంగా మలుచుకోవాలని సీమాంధ్ర రాజకీయ శక్తులు వ్యూహాలకు పదును పెట్టాయి. ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత, తన తండ్రికి వ్యక్తిగతంగా ఉత్తరం రాశారు. దానిని లీక్‌ చేసిన దెయ్యాలు ఎవరు అని సూటిగా ప్రశ్నించారు. ఆ దెయ్యాలెవరో తేలకముందే పార్టీలో కొందరు ముఖ్యనేతల సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా కవితను టార్గెట్‌ చేశారు. తద్వారా ఆ దెయ్యాల్లో తమ ఆరాధ్య నాయకులు కూడా ఉన్నారనే వాళ్లే డప్పుకొట్టి చాటింపు వేసుకున్నారు. ఈ పరిణామాలను ఊతంగా మలుచుకొని ఆంధ్రజ్యోతి సహా అనేక మీడియా సంస్థలు తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈక్రమంలోనే జర్నలిజం ప్రమాణాలను గాలికొదిలేసి అబద్ధాలనే అక్షరాలుగా అచ్చేసి వికటాట్టహాసం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు పురిట్లోనే ముగింపు పలకపోతే ఆ శక్తులు తెలంగాణ అస్తిత్వాన్నే దెబ్బతీసే ప్రమాదముంది.

Naveen Kamera